Developmental News

...for change makers

20081222

వారసులకు పరిహారం చెల్లించాలి : సుప్రీం

పాలసీదారుని మృతిని తెలుపక పోయినా మోటారు వాహన బీమా సంస్థ మృతుని వారసులకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. బ్యాంకు రుణంతో ఒక ట్రక్‌ను ఆత్మారామ్‌ కొనుగోలు చేశాడు. ఈ వాహనానికి యునైటెడ్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ బీమా పాలసీని తీసుకున్నాడు. 1991లో ఆత్మారామ్‌ మరణం తరువాత ఈ వాహనాన్ని నడుపుతున్న అతని వారసులు రిజిస్ట్రేషన్‌ మార్పిడి చర్యలు తీసుకోలేదు. బీమా మొత్తాన్ని ఆత్మారామ్‌ పేరిటే ఏటా బ్యాంకు ద్వారా చెల్లించారు. 1994 సెప్టెంబర్‌ 15న ఈ వాహనానికి ప్రమాదం సంభవించడంతో డ్రైవర్‌ చత్తార్‌సింగ్‌ మరణించాడు. మృతుని కుటుంబానికి రూ.1.42 లక్షలు చెల్లించాలని కార్మిక పరిహార కమిషనర్‌ బీమా కంపెనీని ఆదేశించారు. పాలసీదారుడు మరణించిన కారణంగా పరిహారాన్ని చెల్లించలేమని బీమా సంస్థ వాదించింది. ఈ వాదనను తోసిపుచ్చిన హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు.. పాలసీ రెన్యూవల్‌ సమయంలో తనిఖీ చేయాల్సిన బాధ్యత కంపెనీదే అయినందున, పరిహారం చెల్లింపును తిరస్కరించలేరని స్పష్టం చేసింది. దీంతో బీమాసంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో పాలసీ తీసుకున్న వ్యక్తి మరణాన్ని తెలియచేయలేదని పరిహారం చెల్లింపునకు నిరాకరిస్తున్న సంస్థ, ప్రీమియంను స్వీకరించడకుండా ఉండాల్సిందని జస్టిస్‌ ఎస్‌బీ సిన్హా, సిరియాక్‌ జోసెఫ్‌లతో కూడిన సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Labels:

సమాచారం అందడంలేదు!

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సమాచారహక్కు చట్టం (ఆర్‌టీఐ) పలు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో అమలు కావడంలేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా మొత్తం చట్టం ఉద్దేశమే దెబ్బతింటోందని పేర్కొంది. గుజరాత్‌, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌లలోని కొన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీఆర్‌ఐఏ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం నిర్వహించింది. మొత్తం పది రాష్ట్రాల్లో జరిపిన ఈ సర్వే ఫలితాలను 'ఆర్‌టీఐ కింద సమాచారం పొందడం: ప్రజల అనుభవం' పేరుతో విడుదల చేసింది. మధ్యప్రదేశ్‌లో 90శాతం మంది, కేరళలో 84శాతం మంది ప్రజా సమాచార అధికారుల (పీఐఓ) నుంచి కోరిన సమాచారాన్ని పొందుతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో 55శాతం, రాజస్థాన్‌లో 66శాతం, హర్యానాలో 68శాతం మందికి అది లభిస్తోందని పేర్కొంది. మొత్తంమీద సగటున 68.41శాతం మందికి మాత్రమే కోరిన సమాచారం లభ్యమవుతోంది. బీహార్‌, జార్ఖండ్‌లలో కేవలం 45శాతం మంది దరఖాస్తుదారులకు మాత్రమే కావాల్సిన సమాచారం లభిస్తోందని తెలిపింది. ప్రజలు కోరిన సమాచారం ఇచ్చే విషయంలో పీఐఓలు ఆలస్యంగా స్పందించడం వల్లే ఈ చట్టం ఆశించిన స్థాయిలో అమలుకావడం లేదని సర్వే పేర్కొంది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తు చేసిన 150 రోజుల తర్వాతే అధికారులు ఆ సమాచారం అందిస్తున్నారని, పైగా అందుకోసం దరఖాస్తుదారుడు కనీసం ఐదుసార్లు వారిచుట్టూ తిరగాల్సి వస్తోందని వెల్లడించింది. దాదాపు 43శాతం మంది దరఖాస్తుదారులు రెండు నుంచి ఐదుసార్లు సంబంధిత విభాగాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపింది. బీహార్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌లలో పరిస్థితి మరీ ఘోరంగాఉందని పేర్కొంది. 20శాతం మందికి పైగా దరఖాస్తుదారులు సంబంధిత అధికారుల వద్దకు పదిసార్ల కంటే ఎక్కువగానే వెళ్లాల్సి వస్తోందని తెలిపింది.

Labels:

రూ.527 కోసం పదేళ్ల న్యాయపోరాటం

పదేళ్ల న్యాయపోరాటం చేసిన ఓ వృద్ధుడు చివరకు విజయం సాధించాడు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం తపాలా కార్యాలయం నుంచి బి.ఆర్‌.శర్మ (75) 1996లో రూ.3వేలు రుణం తీసుకున్నాడు. గడువుకు ముందే రుణాన్ని చెల్లించేశాడు. అయినా కార్యాలయం రూ.527 ఎక్కువగా వసూలు చేసింది. దీనిపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి రూ.వెయ్యి ఖర్చు చేశారు. పదేళ్ల పోరాటంతర్వాత వినియోగదారుల ఫోరం శర్మకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అతనికి రూ.527తో పాటు న్యాయ పోరాటానికైన ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది. శర్మ న్యాయవాది సునీల్‌ పరేఖ్‌ మాట్లాడుతూ 'ఈ పోరాటం కేవలం రూ.527 కోసం కాదని వ్యవస్థలోని లోపాలపైనేనని' పేర్కొన్నారు.

Labels:

20080414

బ్యాగును పోగొట్టినందుకు రూ. 2 లక్షల పరిహారం

బ్యాగును రవాణా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ రూ. రెండు లక్షలు పరిహారంగా ప్రయాణికునికి చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. స్థానిక న్యూఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో అంకాలజీ విభాగాధిపతిగా పని చేస్తున్న డాక్టర్ రాకేష్ చోప్రా 1998 నవంబర్‌లో జరిగిన అంతర్జాతీయ వైద్య సదస్సులో పాల్గొనేందుకు ఏథెన్స్ వెళ్లారు. అక్కడ విమానం దిగిన తరువాత తన పరిశోధనాపత్రాలున్న బ్యాగు కనిపించకుండా పోయిన విషయాన్ని డాక్టర్ రాకేష్ గుర్తించారు. ఇతర బ్యాగులు కూడా కదిలించినట్టు కనిపించాయి. పోయిన బ్యాగు ఆచూకీ కోసం సిబ్బంది చేసిన యత్నం ఫలించలేదు. దీంతో ఆయన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనలేకపోయారు. తరువాత ఢిల్లీ వినియోగదారుల కమిషన్‌ను డాక్టర్ రాకేష్ ఆశ్రయించారు.

20080306

498(ఎ) చట్టంలో మార్పులు తేవాలి

మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ రక్షణ చట్టాల దుర్వినియోగాన్ని ఖండిస్తూ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో సంస్థ ప్రతినిధులు చల్లా ఉమా, అనురాధ, విజయభారతితో పాటు పలువురు బాధితులు పాల్గొని దుర్వినియోగం అవుతున్న 498(ఎ) చట్టంలో వెంటనే మార్పులు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ చట్టం పలువురు అమాయకులను నిర్బంధంలోకి తోసేస్తుందన్నారు. ఒక పురుషుడికి తల్లి, చెల్లి, అక్క, వదిన అయిన పుణ్యానికి 498(ఎ) చట్టం వల్ల అరెస్టు అవుతున్నారని  అన్నారు. నేరంతో ఎలాంటి సంబంధం లేకపోయినా సదరు మహిళ ఇచ్చే ఫిర్యాదుతో కుటుంబసభ్యులు అరెస్టు కావాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. ఫిర్యాదుదారులు మాత్రమే మహిళలా? ఇతరులు కారా? అని ప్రశ్నించారు. ఈ చట్టం కింద ప్రతి 20 నిమిషాలకు ఒక మహిళ అరెస్టు అవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళల హక్కుల పరిరక్షణ పేరిట అమాయకుల మానవ హక్కులను ఉల్లఘించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 'వరకట్నం' పేరిట పెడుతున్న కేసుల వల్ల ఎన్నో జీవితాలు బలయ్యాయని గుర్తు చేశారు. ఈ దృష్ట్యా 498(ఎ) చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీపుల్స్ గ్రీవెన్స్ ఫోరం కన్వీనర్ శ్రీనివాస్‌యాదవ్, బాధిత తల్లులు సరోజినీదేవి, విజయలక్ష్మీ తదితరులు పాల్గొని మాట్లాడారు.

గంటపాటు విద్యుత్తు ఉపకరణాలకు స్వస్తి

విద్యుత్తు పొదుపుతో పాటు భూతాపానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా  ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అందరూ ఇళ్లల్లో ఉన్న విద్యుత్తు దీపాలు ఆర్పి ఉద్యమానికి చేయూతనివ్వాలని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాఘవేందర్ కోరుతున్నారు. ముంబయిలో డిసెంబర్ 15న నిర్వహించిన 'బత్తీ బంద్' కార్యక్రమమే తమకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు.  ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి నగరంలో వివిధ రంగాల్లో పని చేస్తున్న యువత రాఘవేందర్, మోహన్, మధుకర్, రజిత, పుష్కర్, సంపత్, షవాలీ నడుం బిగించారు. వీరంతా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులు. ఏదైనా సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఉద్యమం. ఈ కార్యక్రమానికి గ్రేటర్ కమిషనర్ సీవీఎస్‌కే శర్మతో పాటు కాలుష్య నియంత్రణ మండలి, ఈపీటీఆర్ఐ, నెడ్‌క్యాప్ తదితర సంస్థలూ సహకరిస్తున్నాయి. వివరాలకు 99088 15490లో సంప్రదించవచ్చన్నారు.

20080212

ఢిల్లీలో నో స్మోకింగ్‌ బోర్డు తప్పనిసరి

ఢిల్లీ లోని రెస్టారెంట్లు, గెస్టు హౌస్‌ల ముందు 'నో స్మోకింగ్‌ ఏరియా' బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించాలని ఢిల్లీ పోలీసులకు వాణిజ్య సంస్థలకు హెచ్చరికలు జారీచేశారు. లేనట్త్లెతే యజమానులు రూ.500 జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. 1996 ఢిల్లీ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ స్మోకింగ్‌, నాన్‌స్మోకర్స్‌ హెల్త్‌ సంరక్షణ చట్టం కింద నగరంలోని హోటళ్ళు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ఈటింగ్‌ హౌస్‌లు, గెస్టు హౌస్‌లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ చట్టంలోని 10వ సెక్షన్‌ ప్రకారం ప్రజలు ఎక్కువగా వచ్చే ఆయా సంస్థల వద్ద ఉండే ముఖ్యమైన ప్రదేశాలు లేదా రాకపోకల గేట్ల వద్ద నో స్మోకింగ్‌ జోన్‌, పొగ తాగటం నేరం అనే బోర్డులు ఉండాలి. ఈ నిబంధనను ఉల్లంఘించిన వ్యక్తికి మొదటిసారి రూ.100, రెండోసారి రూ.200 జరిమానాగా చెల్లించాలి. ఈ జరిమానా రూ.500 వరకు పొడిగించవచ్చు.
డీయూలో ఫిబ్రవరి నెల 15 నుంచి ధూమపాన నిషేధం అమలు
ఢిల్లీ యూనివర్సిటీలో ఫిబ్రవరి 15 నుంచి ధూమపాన నిషేధం అమలు చేయనున్నారు. ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు సర్క్యులర్లు జారీ చేశారు. పొగ తాగకూడదనే సందేశాన్ని వీధి నాటకాలు ప్రదర్శించడం, గోడలపై పెయింటింగ్‌లు, పోస్టర్లను అతికించడం ద్వారా ప్రచారం చేస్తున్నారు. క్యాంపస్‌ సమీపంలో సిగరెట్లను విక్రయించే దుకాణదారులను పంపించి వేశామని యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు అమృత బహ్రి అన్నారు. మొదటిసారి ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారిపై రూ.200 జరిమానా విధిస్తారు. రెండో సారి ఉల్లంఘిస్తే రూ.500 వరకు ఫైన్‌ వేస్తారు.

వంటనూనె తయారీ యూనిట్లపై దాడి

వంటనూనె తయారీ యూనిట్లపై తూనికలు, కొలతల అధికారులు దాడులు చేసి 58 మిల్లులపై కేసులు నమోదు చేశారు. తక్కువ మోతాదులో అయిల్‌ను ప్యాకింగ్‌ చేస్తున్న యూనిట్లపై హైదరాబాద్‌, రంగారెడ్డిలకు చెందిన అధికారులు దాడులు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని గగన్‌పహాడ్‌, కాటేదాన్‌, బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో ఉన్న గోవర్దన్‌, మనియర్‌, అనీల్‌, అరుణ, గుడ్‌ హెల్త్‌ ఆగ్రోటెక్‌, షాలిమర్‌ డ్రాప్‌, ధూల్‌చంద్‌, పవన్‌, షాలిమర్‌, సర్దా, శీతల్‌, రామచరణ్‌ రిఫైనరీ అయిల్‌ యూనిట్లపై కేసులు నమోదు చేశామని లీగల్‌మెట్రాలజీ కంట్రోలర్‌ తెలిపారు.

20080114

సమాచార హక్కు దుర్వినియోగం

సమాచార హక్కు చట్టం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, శిక్షలకు సంబంధించిన నిబంధనలను చేరుస్తూ ఈ చట్టాన్ని సవరించాల్సి ఉందని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) అభిప్రాయపడింది. ' ఈ చట్టాన్ని దుర్వినియోగ ఉద్దేశంతో సమాచారం కోరే వారిని శిక్షించే చర్యలు తీసుకోడానికి వీలుగా ఈ చట్టాన్ని సవరించాల్సిన అవసరాన్ని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి' అని కమిషన్‌ పేర్కొంటూ నవోదయ విద్యాలయకు చెందిన ఓ ఉపాధ్యాయుని దరఖాస్తును కొట్టివేసింది.
కేవలం ఆ బడిపై అక్కసు తీర్చుకోవడం కోసమే ఈ దరఖాస్తును ఆయుధంగా వాడుకోవాలని పిటిషనర్లు రమేశ్‌చంద్ర, ఆయన భార్య ఉమాకుమారి విశ్వప్రయత్నం చేసినట్టుగా కమిషన్‌ నిర్ధారించింది. రమేశ్‌ చంద్రను బదిలీ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై ఆ దంపతులు తొలుత కేంద్ర పాలనా వ్యవహారాల ట్రిబ్యునల్‌ (సీఏటీ)ని ఆశ్రయించగా చుక్కెదురైంది. తరువాత హైకోర్టులోనూ, అనంతరం షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్‌లోనూ అదే పరిస్థితి. చిట్టచివరగా ఆర్టీఐకి అర్జీ పెట్టుకున్నారు. ఇదంతా గమనించిన సమాచార కమిషనర్‌ ఓపీ కేజారీవాల్‌ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పబ్లిక్‌ టాయ్‌లెట్లు వాడితే పారితోషికం

మనం పబ్లిక్‌ టాయ్‌లెట్లు వాడితే డబ్బులు చెల్లించడం ఎక్కడైనా ఉన్నదే. కానీ, వాడినందుకు మనకే డబ్బులిస్తోంది ఒక సంస్థ. ఒక్కసారికి పదిపైసల చొప్పున లెక్కకట్టి మరీ నెలవారీ చెల్లింపులు చేస్తోంది. తిరుచిరాపల్లి (కేరళ) సమీపంలోని ముసిరికి చెందిన సొసైటీ ఫర్‌ కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ అండ్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ అలా చేస్తోంది! ఎరువుగా మలమూత్రాల వాడకంపై పరిశోధనలు జరిపే లక్ష్యంతో ఈ పని చేస్తున్నామని సంస్థ డైరెక్టర్‌ సుబ్బరామన్‌ చెప్పారు.

వైద్యులు, ఆస్పత్రులు నిబంధనలను పాటించాలి

జాతీయ వైద్యమండలి నిబంధనలను రాష్ట్రంలోని వైద్యులు, ఆస్పత్రుల యాజమాన్యాలు విధిగా అనుసరించాలని ఆంధ్రప్రదేశ్‌ వైద్యమండలి ఛైర్మన్‌ డాక్టర్‌ వల్లభనేని రాంప్రసాద్‌ కోరారు. ఇటీవల నిబంధనలను ఉల్లంఘించిన ఇరువురి వైద్యులపై కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉస్మానియా వైద్య కళాశాల వైద్యుడు వి.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌ విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని వచ్చిన ఆరోపణలు నిరూపణ అయ్యాయని తెలిపారు. తిరుపతికి చెందిన వైద్యుడు ఎం.శ్రీనివాసరావు కూడా నిబంధనలను ఉల్లంఘించినందున వీరిరువురి రిజిస్ట్రేషన్లు ఏడాది పాటు రద్దు చేస్తున్నామని చెప్పారు. ''వివిధ రకాల దీర్ఘకాలిక, మొండి వ్యాధులకు అద్భుతమైన చికిత్స చేస్తామంటూ కొందరు వైద్యులు పత్రికలు, కరపత్రాల ద్వారా జారీచేస్తున్న ప్రకటనలు వైద్యమండలి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇకపై వైద్యులు, ఆస్పత్రులు ప్రకటనలు జారీ చేసేటప్పుడు నైతిక విధానాలను అనుసరించాలి'' అని కోరారు.

స్మార్టుకార్డులతో రూ.18 కోట్లు ఆదా

సామాజిక పింఛన్లు, ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించే స్మార్టుకార్డుల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనివల్ల నకిలీలను అరికట్టడంతో పాటు ఏటా సుమారు రూ.18 కోట్లు ఆదా చేయవచ్చని అధికారుల అంచనా . ప్రస్తుతం వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కొన్ని మండలాల్లో ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి ఆరు జిల్లాల్లో, వచ్చే డిసెంబర్‌ నాటికి రాష్ట్రమంతటా వర్తింపచేయాలని భావిస్తున్నారు. ఇందుకు 13 బ్యాంకులతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు. మౌలిక వసతులను బ్యాంకులు సమకూర్చనున్నాయి. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు స్మార్టుకార్డుల వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే పూర్తి చేయనుంది. అనంతరం తొలుత సామాజిక పింఛన్ల లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తారు. తర్వాత గ్రామాల్లో ఎంపికజేసిన మహిళలకు శిక్షణ ఇస్తారు. ఈ ప్రక్రియ అంతా ఫిబ్రవరి మూడోవారానికల్లా ముగించి లబ్ధిదారులకు స్మార్టుకార్డులను పంపిణీ చేస్తారు. తొలివిడతగా వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏప్రిల్‌ నుంచి స్మార్టుకార్డుల ద్వారా పింఛన్లు పంపిణీ ప్రారంభిస్తారు. డిసెంబరు నాటికి రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఈ సేవలను విస్తరించనున్నారు.

20071227

పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో మెడికల్ షాపులు

రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో 24 గంటలూ పని చేసేలా మెడికల్ షాపులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో కిరోసిన్ బంకులను కూడా నెలకొల్పుతున్నట్లు చెప్పారు. దీన్ని నివారించడం కోసమే ముందుగా పాత తాలూకా కేంద్రాల్లో మందుల షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేరళలో పౌరసరఫరాల సంస్థ విజయవంతంగా మందుల షాపులను నడుపుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఖరీప్‌లో రైతులకు వరి ధాన్యం మద్దతు ధరలు లభిస్తున్నాయన్నారు. గ్రేడ్ ఏ రకం క్వింటాల్‌కు రూ.775 మద్దతు ధర ఉండగా.. మిలర్లు రూ.876 వరకు కొనుగోలు చేశారని తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 62,446 మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని చెప్పారు. వచ్చే ఏప్రిల్ నెల నుంచి రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 2009 నాటికి మహిళలకు 25 లక్షల గ్యాస్ కనెక్షన్‌లు ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఏపీ ఆన్‌లైన్‌లో ఉచితంగా తెలుగు సాఫ్ట్‌వేర్

 'ఏపీఆన్‌లైన్' www.aponline.gov.in లో తెలుగు సాఫ్ట్‌వేర్‌ను ఉంచామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్ తెలిపారు. కంప్యూటర్ సాయంతో నిర్వహించే పాలన వ్యవహారాల్లోనూ తెలుగు వాడకాన్ని పెంచే ఉద్దేశంతో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉంచినట్లు తెలిపారు. దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోని 'గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్' సూచికలో 'డౌన్‌లోడ్ తెలుగు సాఫ్ట్‌వేర్' ఉంటుందని తెలిపారు. విన్డోస్ ఎక్స్‌పీ ఉన్న కంప్యూటర్ల ద్వారానే డౌన్‌లోడ్ అవుతుంది.

20071226

సెల్‌లో విద్యుత్తు బిల్లు

సెల్‌ఫోన్ ఐదేళ్ల క్రితం వరకు సమాచారాన్ని అందిపుచ్చుకునేందుకే ఉపయోగపడేది. ప్రస్తుతం ఈ ఫోన్ మరిన్నో సేవలను అందిస్తోంది. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ పేపర్, మొబైల్ టీవీ... ఇలా వివిధ రకాలుగా రూపాంతరం చెందుతోంది. తాజాగా విద్యుత్తు శాఖ తీసుకున్న నిర్ణయంతో విద్యుత్తుకు సంబంధించిన వివరాలను సెల్‌లో చూసుకునే వెసలుబాటు ఏర్పడింది. సీపీడీసీఎల్ అధికారులు జెనీవా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్‌తో కలిసి ఎస్.ఎం.ఎస్. ద్వారా విద్యుత్తు సంబంధిత సమాచారాన్ని వినియోగదారులకు అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సొంత భాషలో మెసేజ్‌లు పంపే సదుపాయం కల్పించింది. సీపీడీసీఎల్ ద్వారా సెల్‌ఫోన్ ఉన్న విద్యుత్తు వినియోగదారులకు ఎస్.ఎం.ఎస్. ద్వారా బిల్లు వివరాలు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం వినియోగదారులు ముందుగా తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతినెలా విద్యుత్తు బిల్లు పంపడంతో పాటు, బిల్లు చెల్లించిన వెంటనే 'ధన్యవాదాలు' అంటూ సమాచారం పంపుతారు. వినియోగదారుడు ఉంటున్న ప్రాంతంలో విద్యుత్తు సరఫరాలో ఏమైనా అంతరాయాలుంటే ఆయా వివరాలూ పంపిస్తారు. ఇందుకు వినియోగదారుడికి అదనంగా ఎలాంటి ఛార్జీ పడదు. ఈ సేవలను మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే పరిమితం చేశారు. త్వరలో అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తారు.
మొబైల్ వినియోగదారులు తమ విద్యుత్తు సర్వీసు నంబరు, ఈఆర్ కోడ్‌ను కంపోజ్ చేసి, 57333 నంబరుకు ఎస్ఎంఎస్ పంపి రిజిస్టర్ చేసుకోవచ్చు. నెట్ అందుబాటులో ఉండే వినియోగదారులు www.apcentralpower.com  వెబ్‌సైట్‌లో 'మొబైల్ అలర్ట్స్' అనే లింక్‌లోకి వెళ్తే సరిపోతుంది. అక్కడ కోరిన సమాచారాన్ని అందజేసి, తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు

20071205

శస్త్ర చికిత్సలో నిర్లక్ష్యానికి నష్టపరిహారం

శస్త్ర చికిత్సలో నిర్లక్ష్యం ప్రదర్శించినందున చోడవరం ప్రాంతానికి చెందిన వైద్యుడొకరు రూ.50 వేలు నష్ట పరిహారంతోపాటు వైద్య ఖర్చులకు పది వేలు, మరో పది వేలు ఖర్చులకు ఫిర్యాదికి చెల్లించాలని విశాఖపట్నం జిల్లా వినియోగదారుల ఫోరం- 1 అధ్యక్షుడు వై.ఢిల్లీశ్వరరావు తీర్పు చెప్పారు. బాధితుడు ముమ్మిడిశెట్టి కృష్ణ ఈనాడుకు అందించిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి. రావి కమతంలో గతంలో ముమ్మడి శెట్టి కృష్ణ ఉండేవాడు. ఆ సమయంలో అతని జననేంద్రియాల వద్ద ఇబ్బందిగా ఉండటంతో చోడవరం ప్రాంతానికి చెందిన డాక్టర్ కె.సుందర్‌రామాన్ని సంప్రదించాడు. బాధితుడిని పరీక్షించిన ఆయన చిన్న శస్త్రచికిత్స అవసరమని, దీనికి రూ.1000 చెల్లించాలని తెలిపారు. బాధితుడు ఫీజు చెల్లించిన పిదప డాక్టరు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఇది పూర్తయిన తర్వాత అతనికి మరింత ఇబ్బంది కలగటంతో డాక్టరును తిరిగి సంప్రదించాడు. సుందరరామం పరీక్షించి వైద్య చికిత్స చేసినా ఫలితం లేకపోవటంతో బాధితుడు నగరానికి చెందిన డాక్టర్ బి.రాంబాబును సంప్రదించారు. మొదట జరిగిన శస్త్ర చికిత్సలో తలెత్తిన మైనరు లోపాన్ని రాంబాబు సరిదిద్దారు. శస్త్ర చికిత్సలో జరిగిన నిర్లక్ష్యానికి నష్టపరిహారం కోరుతూ బాధితుడు జిల్లా వినియోగదారుల ఫోరం-1లో కేసు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫోరం-1 అధ్యక్షుడు వై.ఢిల్లేశ్వరరావు పై తీర్పు ఇచ్చారు

20071130

ఆంధ్ర ప్రదేశ్లో సిటిజన్ ఛార్టర్లు

ఆంధ్ర ప్రదేశ్లో సిటిజన్ ఛార్టర్లను ప్రకటించిన కొన్ని సంస్థలు :
  • ఎ.పి. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
  • ఎ.పి. ఫైర్ సర్వీసెస్
  • ఎ.పి. ఇండస్ట్రియల్ డవలప్మెంట్ కార్పొరేషన్
  • ఎ.పి. ట్రాన్స్కో/ డిస్కమ్
  • ఎ.పి. హౌసింగ్ బోర్డు
  • ఎ.పి. హౌసింగ్ కార్పొరేషన్
  • ఎ.పి. హౌసింగ్ ఫెడరేషన్
  • ఎ.పి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
  • ఎ.పి. స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
  • ఎ.పి. పోలీస్
  • ఎ.పి. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ
  • ఎ.పి. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్
  • బి.సి వెల్ఫేర్ డిపార్ట్మెంట్
  • బోర్డ్ ఆఫ్ కాలేజియట్ ఎడ్యుకేషన్
  • బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
  • బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్
  • బాయిలర్స్ డిపార్ట్మెంట్
  • ఛీఫ్ ఇంజనీర్స్, నేషనల్ హైవేస్
  • సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్
  • కమీషనరేట్ ఆఫ్ టెండర్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హజ్బెండరీ
  • డిపార్ట్మెంట్ ఆఫ్ కమర్షియల్ టాక్సెస్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ హాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, స్టాంప్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ
  • డిపార్ట్మెంట్ ఆఫ్ స్మాల్ సేవింగ్స్, లాటరీస్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్
  • డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
  • ఇఎస్ఐ హాస్పటల్స్
  • గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్
  • జవహర్ బాల భవన్
  • మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్
  • మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్
  • పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్
  • ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ డిపార్ట్మెంట్
  • స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
  • స్టేట్ ఆర్చివ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
  • తెలుగు అకాడమీ
  • డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (హోమియోపతి, ఆయుర్వేదిక్ హాస్పటల్స్)
  • దాదాపు జాతీయ బ్యాంకులన్నీ కూడా సిటిజన్ ఛార్టర్స్ను ప్రకటించాయి.

Labels:

20071129

యజమానులు కాదు - సేవకులు

సిటిజన్స్ ఛార్టర్
పౌరుల అధికార పత్రం

----గాలి ఉదయ కుమార్, కార్యదర్శి, కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ, హైదరాబాద్
ఒకానొక ప్రభుత్వ కార్యాలయంలో ఒక చిన్న పని జరిగేందుకు 27 సంవత్సరాల ఆలస్యం జరిగిందంటే మీరు నమ్మగలరా? కాని ఇది నిజం. మద్రాస్ నివాసి లక్ష్మీ రాఘవాచారి తనకు అలాట్ అయిన ప్లాట్ పట్టాను ఇవ్వవలసిందిగా కోరుతూ 1965లో మైలాపూర్ తహసీల్దారుకు దరఖాస్తు పెట్టుకొన్నారు. 27 నిండు సంవత్సరాల పాటు ఆయనకు పట్టా లభించలేదు. సంబంధిత అధికారులకు ఆయన 101 ఉత్తరాలు వ్రాశారు. విసిగి వేసారి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసిన తర్వాత 1992లో ఆయనకు పట్టా లభించింది. ఒరిస్సాకు చెందిన చింతామణి మిశ్రా కొన్ని సర్టిఫైడ్ కాపీల కోసం తహశీల్దారు కార్యాలయంలో అవసరమైన ఫీజును చెల్లించారు. ఇక ఆ తర్వాత ఆయన బాధలు మొదలయ్యాయి. కార్యాలయం చుట్టూ 16 సార్లు ఆయన తిరగ వలసి వచ్చింది. తహశీల్దారునీ, సబ్ కలెక్టర్నీ, కలెక్టర్నీ కలిసినా ప్రయోజనం కనిపించలేదు. చివరకు ఫోరంను ఆయన ఆశ్రయించి సమస్యను పరిష్కరించుకోవలసి వచ్చింది. ఇటువంటి సంఘటనలు ఒక్క ప్రభుత్వ సంస్థలకే పరిమితం కాదు. ప్రైవేట్ సంస్థల్లోను కోకొల్లలు.

సేవలను అందించే వారి అలసత్వం, నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగా ఇటువంటి కష్ట నష్టాలకు మీరు ఎపుడైనా గురయ్యారా? సమస్య చిన్నదే కావచ్చు. వాటిల్లిన నష్టమూ పెద్దది కాకపోవచ్చు. రైల్వేలు, ఆర్టీసీ, బ్యాంకులు, టెలికామ్, విద్యుత్, పోస్ట్, కొరియర్ వంటి వివిధ సంస్థలు అందించే సేవల్లో లోపాలతో బాధ పడి, ఎందుకిలా అయ్యింది-మనం ఏమీ చేయలేమా అని నిస్సహాయంగా మానసిక క్షోభకు లోనయ్యారా?

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 1998 డిసెంబర్ 12న రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పెన్షన్ లేకుండా అయిదు లక్షల రూపాయలను చెల్లించాలని ఆయన భార్య దరఖాస్తు చేసుకొన్నారు. ఆరేళ్ల పాటు ఫైలు తిరిగింది. ఈ ఆరేళ్ల కాలంలో పెన్షన్ కూడా రాలేదు. దాంతో ఉద్యోగి కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనక తప్పలేదు. 2004 డిసెంబర్లో ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్గ్రేషియాను వెంటనే చెల్లించాలంటూ చేసిన ఆదేశాలను అమలు చేయలేదు. మళ్లీ రెండవ సారి ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవటంతో ఆ కుటుంబానికి పరిహారం అందింది. ప్రభుత్వ ఉద్యోగి మరణించిన ఆరేళ్లకు, కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగిన తర్వాత, ఆ కుటుంబానికి సాయం అందింది. అదీ ముఖ్యమంత్రి కార్యాలయం రెండు సార్లు జోక్యం చేసుకొన్నాక!
ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికే, ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, ఏ చదువూ లేని ఒక సామాన్యుడు, సన్నకారు రైతు, కూలి, ఒక చిన్న వ్యాపారికి... ప్రభుత్వ కార్యాలయాలతో పని పడితే... ఆ పని ఎంత కాలానికి పూర్తవుతుంది? అందుకు ఎంత ఖర్చవుతుంది? ఎన్ని ఇబ్బందులెదురవుతాయి? ఏ పని ఎప్పటికి పూర్తవుతుందో చెప్పటం ఎవరికి సాధ్యం? ఈ ప్రశ్నలన్నిటికీ పరిష్కారాన్ని సూచించేదే 'సిటిజన్ ఛార్టర్'.

సిటిజన్ ఛార్టర్ కార్యక్రమం ప్రజాస్వామ్య సంస్కరణల్లో ఒక భాగం. వినియోగదారుడిని కేంద్రంగా చేసుకొని ప్రజానుకూల విధానాలతో ప్రజలకూ, ప్రభుత్వానికీ మధ్య భాగస్వామ్యాన్ని పెంచే ప్రక్రియ ఇది. ఇది ఒక భావన లేదా ఊహ కాదు. ఇది ఒక క్రియాశీలక కార్యక్రమం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజమైన యజమానులైన పౌరులకు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవలను అందించేందుకు ఇది ఉత్తమమైన మార్గం.
'ఉత్తమమైన పాలన' లేదా 'సుపరిపాలన'ను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆశిస్తున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, అందుబాటు లేదా పౌరులతో సాన్నిహిత్యం - ఈ మూడూ సుపరిపాలనకు సంబంధించిన ముఖ్యాంశాలు. మేలైన ప్రజా సేవలను అందించాలంటూ దేశ ప్రజలు స్వాధికారంతో అడగటంతో మన దేశంలో సిటిజన్స్ ఛార్టర్ కార్యక్రమం ప్రారంభమైంది.
1991లో యునైటెడ్ కింగ్డమ్లో అప్పటి ప్రధాని జాన్ మేయర్ సిటిజన్స్ ఛార్టర్ కార్యక్రమాన్ని పది సంవత్సరాల జాతీయ కార్యక్రమంగా ప్రకటించారు. 1996లో సమీక్షానంతరం కార్యక్రమం పేరును 'సేవ ప్రధమం (సర్వీస్ ఫస్ట్)గా మార్చారు. ప్రపంచవ్యాప్తంగా సిటిజన్ ఛార్టర్లు చెప్పుకోదగిన రీతిలో ఆసక్తిని రేకెత్తించాయి. ఆస్ట్రేలియా, కెనడా, సంయుక్త రాష్ట్రాలు, బెల్జియం, సింగపూర్ల లోను యునైటెడ్ కింగ్డమ్ తరహాలోనే సిటిజన్ ఛార్టర్ కార్యక్రమాలను చేపట్టారు.
మన దేశం విషయానికి వస్తే 'వినియోగదారుల సమన్వయ సమితి' తొలిసారిగా సిటిజన్ ఛార్టర్ ప్రాధాన్యతను తెలియజేస్తూ ఉద్యమాన్ని ప్రారంభించింది. 1994లో జరిగిన కేంద్ర వినియోగదారుల రక్షణ సమితి సమావేశంలో వినియోగదారుల సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రజోపయోగ సేవా సంస్థల సేవలను మెరుగు పరిచే విధానం గురించి ప్రశ్నించినపుడు కేంద్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ఎ.కె.ఆంటోని ప్రతిస్పందిస్తూ తొలుత ఆరోగ్య సేవలతో సిటిజన్ ఛార్టర్ను రూపొందించటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అదే సమావేశంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆగస్ట్ 1996లో అప్పటి ప్రధాని దేవెగౌడ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజా సేవలను మెరుగు పరిచేందుకు సిటిజన్ ఛార్టర్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. 20 నవంబర్ 1996న ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శుల సమావేశం ప్రధాని ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిటిజన్ ఛార్టర్లకు సంబంధించి కొన్ని సిఫార్సులను చేసింది. అన్ని స్థాయిల్లో పరిపాలన వ్యవస్థ సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా, స్వచ్ఛంగా, ఏ అరమరికలు లేకుండా ప్రజావాక్యానికి ప్రతిస్పందించే విధంగా ఉంటుందని ప్రజలకు స్పష్టం చేయవలసిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. మరింత ఆలస్యం కాకముందే ప్రస్తుత స్థితిగతులను సంస్కరించాలని కార్యదర్శుల సమావేశం స్పష్టం చేసింది. పక్షపాతం, ఆలస్యం, లంచగొండితనం, నిర్దయ, ఉదాసీనత - ఇలా ప్రజా సేవలనగానే ప్రజలలో తలెత్తే వ్యతిరేక భావనలను మార్చవలసిన అవసరాన్ని సమావేశం గుర్తించింది. ప్రజా పాలనా వ్యవస్థ సమర్థత, యుక్తియుక్తాలను గురించి ప్రజల్లో, ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించవలసి ఉంది. పారదర్శకమైన, బాధ్యతాయుతమైన ప్రజా సేవలు, వాటి ప్రక్షాళన ఒకదానితో ఒకటి ముడిపడివున్న అంశాలు. వీటినన్నిటినీ దృష్టిలో ఉంచుకొన్నపుడే స్వచ్ఛంగా ప్రతిస్పందించే పరిపాలన సాధ్యమౌతుంది.
ప్రభుత్వ, ప్రజా సంస్థల నిర్వహణలో మరింత పారదర్శకతను పెంపొందించటంతో పాటు, కార్యకలాపాలకు సంబంధించి ఏ రహస్యమూ లేని బహిరంగ ధోరణిని అవలంబించ వలసిన అవసరం ఉంది. సేవలను పొందే ప్రజల సంతృప్తి మేరకు విస్తృతమైన పరిధిలో బాధ్యతాయుతమైన సేవలకు వివరణ ఇవ్వాలి. వీలైనన్ని ఎక్కువ సేవా సంస్థల్లో సిటిజన్ ఛార్టర్లను ప్రవేశపెట్టటంతో పాటు వాటి అమలుకు తగిన చర్యలు తీసుకోవాలి.

సిటిజన్ ఛార్టర్ లోని ప్రధానాంశాలు:
  • ప్రతి ఒక్క ప్రజా సేవలోను ఉత్తమమైన నాణ్యత
  • 'ఎంపిక'లో ప్రజలకు మరింత అవకాశం
  • ఏ తరహా సేవను ఆశించవచ్చో ప్రజలకు తెలియజెప్పటం
  • సేవాలోపం ఉన్నపుడు ఏం చేయాలో ప్రజలకు తెలిసేలా చూడటం

సిటిజన్ ఛార్టర్ లోని ఆరు ప్రధానమైన సూత్రాలు:
  1. ప్రచురితమైన ప్రమాణాలు
  2. సమాచారము, బహిరంగ ధోరణి
  3. ఎంపిక, సంప్రదింపులు
  4. మర్యాదాపూర్వకమైన, సహాయం అందించే ధోరణి
  5. సేవా లోపాలకు సంబంధించి నివృత్తి
  6. డబ్బుకు తగిన విలువ

సిటిజన్ ఛార్టర్ లోని ఆరు ప్రధానమైన సూత్రాల గురించి ఇపుడు విపులంగా పరిశీలిద్దాం.
ప్రమాణాలు : స్పష్టమైన ప్రమాణాలను పేర్కొనటంతో పాటు వాటిని ప్రచురించాలి. ప్రభుత్వ కార్యాలయాలలో ఈ ప్రమాణాలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. పని పూర్తయ్యేందుకు అవసరమయ్యే కనిష్ట, గరిష్ట కాల పరిమితిని ప్రమాణాల్లో పేర్కొనాలి.
సమాచారము, బహిరంగ ధోరణి: ప్రజా సేవల నిర్వహణ, అందుకు అయ్యే ఖర్చు, సంబంధిత అధికారి ఎవరు? వంటి వివరాలతో కూడిన సంపూర్ణమైన, వాస్తవిక సమాచారం సరళమైన భాషలో, అందరికీ అర్థమయ్యేలా, అందుబాటులో ఉండేలా చూడాలి.
ఎంపిక, సంప్రదింపులు : సేవలను వినియోగించుకొనే వారితో క్రమానుగుణ సంప్రదింపులు జరిపే అవకాశం కల్పించాలి. సేవలకు సంబంధించి వినియోగదారుల ప్రాధాన్యతలు, సేవల మెరుగుకు చేపట్టవలసిన చర్యల విషయమై వినియోగదారులు వ్యక్తం చేసే అభిప్రాయాలను తెలుసుకోవాలి.
మర్యాదాపూర్వకమైన, సహాయం అందించే ధోరణి : ప్రభుత్వ సిబ్బంది మర్యాదాపూర్వకంగా సేవలను అందించాలి. వారిని గుర్తించేందుకు అనువుగా సిబ్బంది తమ పేరును, హోదాను సూచించే బ్యాడ్జీలను ధరించాలి.
సేవా లోపాలకు సంబంధించి నివృత్తి : ఏదైనా సేవను అందించటంలో పొరపాటు జరిగినపుడు క్షమాపణ తెలియజేయాలి. సేవాలోపం ఎందుకు జరిగిందో తెలిపే కారణాలతో పూర్తి వివరణను ఇవ్వాలి. సమర్థవంతమైన నివృత్తిని సూచించాలి.
డబ్బుకు తగిన విలువ: ప్రజలు తాము చెల్లించే డబ్బుకు తగిన విలువైన సేవలను పొందటం సాధ్యం కావాలి. పన్నుల రాబడి నుంచి పరిపాలన నిమిత్తం వ్యయం చేసే మొత్తాన్ని, పౌరులకు అందే సేవల విలువలను పోల్చి చూసినపుడు డబ్బుకు తగిన విలువ లభించాలి.
ఛార్టర్ మార్క్ : యునైటెడ్ కింగ్డమ్లో విశిష్టమైన, వినూత్నమైన రీతిలో ప్రజా సేవలను అందించే వారిని 'ఛార్టర్ మార్క్ అవార్డు స్కీమ్' గుర్తించి సత్కరిస్తుంది. విశిష్టమైన సేవలు ఏవో సూచించటం ద్వారా ప్రజలు కూడా ఛార్టర్ మార్క్ స్కీమ్లో ముఖ్య పాత్ర వహిస్తున్నారు.

సిటిజన్ ఛార్టర్ల ద్వారా ఏమి సాధించవచ్చు?
  • మానవ వనరుల నిర్వహణలో అభివృద్ధి
  • సిబ్బందిలో కార్యదక్షత పెంపు
  • ప్రజలకు అధికారం
  • జవాబుదారీతనం పెరగటం
  • డబ్బుకు తగిన విలువ
  • తక్కువ సమయంలో పనులు పూర్తి కావటం
  • సిటిజన్ ఛార్టర్ విజయానికి దారి తీసే కారణాలు:
  • సిబ్బంది అందరిలో సిటిజన్ ఛార్టర్ అత్యవసరమనే భావన
  • ఛార్టర్ సూత్రాల పట్ల నిబద్ధత
  • ఛార్టర్ అమలులో ప్రగతిని పర్యవేక్షించటం
  • వ్యక్తిగత పౌరులు, వినియోగదారుల సంఘాలు, ప్రజా సంస్థలతో నిరంతరం సంప్రదింపులు
  • సంస్కరణ చర్యలను చేపట్టటం
  • పరిపాలన వికేంద్రీకరణ
  • నియమాలు, విధానాల సరళీకరణ
  • ఫిర్యాదు పరిష్కార వ్యవస్థల అభివృద్ధి

ఫిర్యాదుకు నిర్వచనం ఏమిటి?
ప్రతిస్పందనను కోరుతూ వ్యక్తం చేసే ఏ అసంతృప్తికరమైన భావననైనా ఫిర్యాదు అనవచ్చు. ఫిర్యాదులను, ఫిర్యాదు చేసేవారిని ప్రతికూల ధోరణితో చూడటం ఏ కార్యాలయంలో నైనా మనం సాధారణంగా చూసేదే. వాస్తవానికి ఫిర్యాదులు సేవను మెరుగు పరుచుకొనేందుకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తాయి. తమ సేవలను ఏ విధంగా మెరుగు పరుచుకోవచ్చో తెలిపే సదవకాశాలుగా పిర్యాదులను చూసేట్లు సిటిజన్ ఛార్టర్ ప్రజా సేవా సంస్థలను ప్రోత్సహిస్తుంది. ప్రతి సేవా సంస్థ తమ దైన బాణీలో ఫిర్యాదును నిర్వచించటంతో పాటు , దానిని తామందించే అన్ని సేవలకూ వర్తింపజేయాలి. విధానాల రూపకల్పన చేసినంత మాత్రాన ఫిర్యాదుల వ్యవస్థ సమర్థవంతంగా ఉంటుందని భావించటానికి వీలు లేదు. ఫిర్యాదుల పట్ల సిబ్బంది వైఖరి ముందు మారాలి.
వ్యక్తులను విమర్శిస్తూ ఫిర్యాదులను చేసే నిందాపూర్వక సంస్కృతి వల్ల సిబ్బందిలో ఫిర్యాదులంటే ఒక భయం కలుగుతుంది. దాంతో వారు ఫిర్యాదులను కప్పిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఫిర్యాదులు చేసేందుకు ఎవరైనా వచ్చినపుడు కోపం, వ్యతిరేక భావనలను ప్రదర్శిస్తూ ప్రతికూల వైఖరితో వ్యవహరిస్తారు. కనుక సేవలు లేదా వ్యవస్థ లోని లోపాలను గుర్తించే సదవకాశాన్ని కల్పించేవిగా ఫిర్యాదులను చూసే వాతావరణాన్ని ప్రతి సంస్థా కల్పించాలి. ఫిర్యాదుల పరిష్కరణా విధానాలు తమకూ అనుకూలమైనవేననే భావనను సిబ్బందిలో కలిగించాలి. ప్రజల దృష్టి కోణం నుంచి సమస్యను చూసి అర్థం చేసుకొనే తత్వాన్ని సిబ్బందికి అలవాటు చేయాలి. ఫిర్యాదుల పరిష్కరణ విధానాలను క్రమశిక్షణా చర్యల నుంచి వేరు చేయాలి.

సమర్థవంతమైన ఫిర్యాదుల వ్యవస్థ ప్రాధమిక సూత్రాలు:
  • ఫిర్యాదుల వ్యవస్థ అందరికీ అందుబాటులో ఉండాలి. పిర్యాదుల వ్యవస్థ గురించి అందరికీ తెలిసేలా తగిన ప్రచారం చేయాలి.
  • ఫిర్యాదుల వ్యవస్థ అర్థం చేసుకొనేందుకు, ఉపయోగించేందుకు సులువుగా ఉండాలి.
  • నిర్థారిత కాల పరిమితితో త్వరితంగా సమస్యా పరిష్కారం జరగాలి. ఫిర్యాదు ప్రగతి గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందాలి.
  • నిష్పక్షపాత ధోరణిలో, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి.
  • అవసరమైనపుడు ఫిర్యాదీల వివరాలను రహస్యంగా ఉంచాలి.
  • ఉన్నతాధికారులకు తగిన రీతిలో సమాచారాన్ని అందజేయటం ద్వారా సేవల అభివృద్ధికి పాటు పడాలి.
  • ఆదర్శవంతమైన ఫిర్యాదుల వ్యవస్థ 'ఎలా ఫిర్యాదు చేయాలో' ప్రజలకు తెలిసేలా చేయటమే కాక ఫిర్యాదు చేయటం వలన ఫలితం కూడా ఉంటుందని తెలుసుకొనేలా చేస్తుంది.

ఫిర్యాదుల పరిష్కరణ :
ఫిర్యాదులను స్వీకరించినట్లు అక్నాలెడ్జ్మెంట్ను ప్రతి శాఖ ఇవ్వాలి. ఫిర్యాదుల పరిష్కరణకు ఎంతకాలం పడుతుందో ముందుగా ఫిర్యాదీకి తెలియజేయాలి. పేర్కొన్న కాల పరిమితిలోగా సమస్యను పరిష్కరించలేకపోతే అందుకు గల కారణాలను వివరిస్తూ ఫిర్యాదీకి సమాచారం అందించాలి. ఫిర్యాదు చేయటం ద్వారా ఏమి ఆశించవచ్చు? సమస్య ఏ మేరకు పరిష్కారం అవుతుంది? అనే వివరాలను ముందుగానే ఫిర్యాదీకి తెలియజెప్పాలి.
తాము చేసే ఫిర్యాదులను సేవా సంస్థ సిబ్బంది సావధానంగా విని పరిష్కరిస్తారనే నమ్మకం కుదిరినపుడే ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తారు. ఫిర్యాదు చేసినా ఏ ఫలితమూ ఉండదని భావించినపుడు ఎవరూ ఫిర్యాదు చేయరు. కనుక ప్రతి సేవా సంస్థా ఫిర్యాదులకు సదా స్వాగతం ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేయాలి. ఫిర్యాదులపై విచారణ జరుగుతుందని, అవసరమైనప్పుడు నివృత్తి అందుతుందని, ఫిర్యాదుల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా సేవల నాణ్యత మెరుగుకు కృషి జరుగుతుందని ప్రజల్లో నమ్మకం కలిగించాలి.
ప్రభుత్వ శాఖ తమను ఒంటరి వాళ్లను చేసి వేధిస్తుందని, ఫిర్యాదు చేసినందుకు శిక్షిస్తుందనే భయం ప్రజల్లో కలిగితే ఫిర్యాదుల దాఖలుకు ఎవరూ ముందుకు రారు. వినియోగదారుడికీ, సేవా సంస్థకూ మధ్య సంబంధం సున్నితమైనది గానూ, దుర్బలమైనది గానూ ఉన్నపుడు ఇది మరీ కష్టం.

ప్రభుత్వ సిబ్బంది - చిన్న గుమస్తా కావచ్చు, లేదా పెద్ద అధికారి కావచ్చు. వీళ్లు అందరూ ప్రజలకు సేవకులు - ఎవరూ యజమానులు కాదు. దే ఆర్ నాట్ మాస్టర్స్ దే ఆర్ సర్వెంట్స్

Labels:

20071128

త్వరలో జాతీయ పొగాకు నియంత్రణ సంస్థ

పొగాకు నిరోధక చట్టాన్ని అమలుచేసేందుకు 'జాతీయ పొగాకు నియంత్రణ సంస్థ'ను ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి అన్బుమణి రాందాస్‌ లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుడు కావూరి సాంబశివరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాలల పరిసరాల్లో పొగతాగడంపై నిషేధం, 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా చూడటం వంటి అంశాలు ఈ సంస్థ పరిధిలోకి వస్తాయన్నారు. బీడీ, సిగరెట్‌ పెట్టెలపై చట్టబద్ధమైన హెచ్చరికల ముద్రణ, వాటిల్లో తార్‌, నికోటిన్‌ ఏస్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారో లేదో కూడా పరిశీలిస్తుందన్నారు.

Labels: ,

20071126

2008 డిసెంబర్ నాటికి 22 జిల్లాల్లో ' ఆరోగ్యశ్రీ'

2008 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని 22 జిల్లాల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి సంబాని చంద్రశేఖర్ ఖమ్మం జిల్లా వైరాలో విలేకరుల సమావేశంలో  వెల్లడించారు.  పేదలకు నాణ్యమైన కార్పొరేట్‌స్థాయి వైద్యాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఆసియాలోనే మొట్టమొదటిగా రాష్ట్రంలో పేద ప్రజల కోసం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పారు.

Labels: ,